సూర్యమాసం - మాఘం

భారతీయుల తత్త్వచింతన, దైవభావన, ఉపాసనా సంప్రదాయం - వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఇవన్నీ ఆదిత్యుని కేంద్రంగా విస్తరించాయని స్పష్టమౌతుంది.
విశ్వసృష్టి స్థితిలయకు హేతువైన పరంజ్యోతి ఇంద్రియాకు, మనస్సుకు అతీతమైనది. కానీ దాని అభివ్యక్తి మనం జ్యోతిర్మండలాలలోనే దర్శించగలం. వివిధ నక్షత్రకాంతులలో కేవలం వెలుగునే కాక, కొన్ని దివ్యశక్తులను కూడా కనిపెట్టి, భూమిపై వాటి సూక్ష్మ ప్రభావాన్ని దర్శించారు మన మహర్షులు. మన పురాణాల్లోని అనేక దేవతాగాథలు, గృహనక్షత్ర విజ్ఞానాలు అనంతాకాశంలోని జ్యోతిర్గణాలలో దాగిన వైశ్విక శక్తి (Cosmic energy) విలాసాలేనని స్పష్టంగా ద్యోతకమౌతోంది.
ప్రధానంగా మన జ్యోతిష్కుటుంబంలోని ’సౌరశక్తి’ని తపశ్శక్తితో అవగతం చేసుకున్న మహర్షులు వివిధ సాధనాల ద్వారా సూర్యమండంలంలోని దివ్యత్వాన్ని అనుసంధానించే ప్రక్రియలను తెలియజేశారు. భాస్కరుని భౌతికంగా చూస్తే ఒక ’మండుచున్న అగ్నిగోళం’. వైజ్ఞానికంగా గమనిస్తే ’ఒక ప్రాణశక్తి కేంద్రం’. ఉపాసనా దృష్టితో చూస్తే "సర్వదేవతాత్మక పరంజ్యోతి".
కాలగణనలో కూడా "ఉదయాదుదయవారం" - అనే శాస్త్రోక్తి ఉంది. సూర్యోదయంనుండి మరునాటి సూర్యోదయం వరకు ఒక దినం అని మన నిర్దేశం. ఇది శాస్త్రీయమైన పద్ధతి. సూర్యుని ఉదయం ఏగ్రహ హోరలో జరుగుతున్నదో దానిని అనుసరించి ఆ దిననామం నిర్దేశించారు. అలా వివిధ గ్రహ హోరలలో సూర్యోదయాలను బట్టి - సూర్య(భాను) వారం, చంద్ర(సోమ)వారం, కుజ(మంగళ)వారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం - అని ఏడు వారాలను నిర్ణయించారు.
సూర్యునిలోనున్న ఏడురకాల శక్తులనే ఈ ఏడు గ్రహశక్తులుగా భావించవచ్చు. స్థూలంగా చూసేవారికి అన్నిరోజులూ ఒకేలా కనపడుతున్నా సూక్ష్మదృష్టికి ప్రతిదినంలో ఒక ప్రత్యేకశక్తి ఉన్నట్లు గోచరిస్తుంది. దానిని ఆధారం చేసుకునే తిథి, వార, నక్షత్రాదులను నిర్ణయించి కాల ప్రభావాన్ని పరిశీలించి జ్యోతిర్విజ్ఞానాన్ని ఏర్పరచారు.
నిత్యం సూర్యోదయ సమయంలో ఆదిత్య భగవానుని నమస్కరించడం, అర్ఘ్యప్రదానం చేయడం మన ప్రాచీన సంప్రదాయం. రవివారాన్ని "ఆది"వారంగా నిర్ణయించారు. సూర్యహోరలో సూర్యోదయం జరిగే వారం ఆదివారం. ఈ వారాన్ని అత్యంత మహిమాన్వితంగా యుగాలనుండి భారతీయ ఋషులు పేర్కొన్నారు.
ఒకప్పుడు భూమండలంలో పలు తావులలో సనాతన హైందవ ధర్మం వ్యాపించి ఉండేదనడానికి ఎన్నో ధాఖలాలు నేడు లభిస్తున్నాయి. కొన్ని వేల ఏళ్ళ క్రితం ’మిత్రసిద్ధాంతం’ యూరోపియన్ భూభాగాల్లో వ్యాప్తి చెందిందని ప్రాచీన చరిత్ర చెబుతున్నది. ఋగ్వేద మంత్రాలలో ’మిత్ర’ నామంతో స్తుతింపబడిన సూర్యభగవానుని ఆరాధన, ఆ ప్రాంతంలో ఉందని, అనేక సూర్యాలయాలు, ఆదివార నియమాలు, భాస్కరార్చనలు, అక్కడ సంస్కృతి అని చరిత్ర. క్రమంగా పుట్టుకొచ్చిన కొత్త మతాలు ప్రచారం, మార్పిడి, దాడి - అనే పద్ధతుల్లో దిగి అక్కడి ’మిత్ర’ సిద్ధాంతాన్ని హింసాదుల ద్వారా, ధ్వంస ప్రక్రియల ద్వారా నశింపజేశాయి. కానీ, అక్కడి ప్రజల్లో వేళ్ళూనుకున్న ’ఆదివారపు’ అనుబంధాన్ని (సెంటిమెంటుని) ీయలేకపోయాయి. దానితో తమమతం ఉనికిని కాపాడుకోవడం కోసం ఆదివారాన్నే తమ ప్రార్థనా వారంగా నిర్దేశించుకుని వ్యాప్తి చేసి ప్రపంచమంతా అది తమ సిద్ధాంతంగా భ్రమింపజేసింది.
కానీ చరిత్రనీ, శాస్త్రాలనీ పరిశీలిస్తే ఆదివార వ్రతాలు వేల ఏళ్ళనాటి ప్రాచీన పురాణాలలో, యుగాలనాటి వైదిక కాలంలో గోచరిస్తున్నాయి.
"సూర్య నమస్కారాలు" ఆరోగ్యానికి ఆలంబనలు - అని భారతీయ యోగవిద్యద్వారా నేడు ప్రపంచ ప్రసిద్ధాలయ్యాయి. "ఆరోగ్యం భాస్కరాధిచ్ఛేత్" అనే వైదికోక్తి ప్రత్యక్షంగా నిరూపితమయింది.
ప్రాతం కాలంలో సూర్యుని నమస్కరించిన వానికి, అర్ఘ్యంతో ఆరాధించే వానికి ఆరోజు సుదినం. అందునా "సప్తమి" తిథి సూర్య తిథిగా పేర్కొన్నారు. ఆనాడు ప్రత్యేకంగా సూర్యోపాసన విశిష్ట ఫలదాయకం.
ప్రతినెలా శుక్ల సప్తమి, కృష్ణసప్తమి - రెండింటికి ప్రాధాన్యమున్నది. ఆయా సప్తమీ తిథులకు ప్రత్యేక నామాలున్నాయి.
సూర్యవారం (ఆదివారం), సప్తమి కలిస్తే అది ఒక మహాపర్వం.
శిశిరంలో చలి తిరిగి, తరుణ సూర్యుని ప్రభావం కొత్త పుంత తొక్కే మాఘమాసం సూర్యునికి ప్రీతికరమని మన సంవత్సర విజ్ఞానం చెబుతోంది.
ఒక విధంగా - ఒక సంవత్సరాన్ని ఒక రోజుగా భావిస్తే ఆ దినానికి ఉషఃకాలం మకర సంక్రమణం, ప్రాతఃకాలం మాఘమాసం.
ఏనాడైనా ప్రాతః కాలం సూర్యోదయానికి ప్రశస్తి. అందుకే సంవత్సరానికి ప్రాతస్సమయం వంటిదైన మాఘమాసంలో సూర్యారాధన విశిష్టమైనది. సూర్యగ్రహానికి అధిదేవత శివుడు. ఆకారణం చేత ఈ మాసంలోనే శివునకు ప్రీతియైన మహాశివరాత్రి ఉన్నది.
ప్రతినెలలోనూ ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ప్రత్యేక తిథి ఉన్నది. చవితి గణపతికి, షష్ఠిక్ సుబ్రహ్మణ్యునికి, సప్తమి సూర్యునికి, ఏకాదశి ద్వాదశులు విష్ణువుకు, అష్మీ నవములు గౌరికి ప్రాధాన్యం. ఆ తిథులు మాఘమాసంలో మరీ ప్రత్యేకం. మాఘ పూర్ణిమకి విశిష్టమైన మహిమ ఉన్నది.
కార్తీకం దీపానికి, మాఘం స్నానానికి, వైశాఖం దానానికి ప్రధానం.
ఇలా అనేక ప్రత్యేకతలతో మాఘమాసం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నది.

No comments:

Post a Comment